పైర గాలి వీచింది... మేఘమాల పలికింది
వాన జల్లు కురిసింది.. వాడిన చెట్టు లేచింది
భూమి పులకరించింది.. రైతు మనసు రమ్యమయింది..
ఎన్నో ఏళ్ళ ఎదురుచూపు.. నిజమై నిలిచింది..
మొలకెత్తే విత్తనాలే జన జీవనానికి ఆధారాలు
వెల్లివిరిసే ఇంద్ర ధనుస్సులే దారి చూపే దివిటీలు..
చల్లనైన ఋతుపవనాలు వీస్తుంటే ఎదో తెలియని ఆనందం..
పోగుట్టుకొన్న నిధి ఏదో దొరికిందన్న సంబరం..
కోట్లిచ్చినా కొనగలమా జీవం నిండిన ఆ జలాన్ని..
తలక్రిందులుగా తపస్సు చేసినా తేగలమా రాని తొలకరిని..
ఎలినినో రక్కసిని ఎదిరించి గెలిచిన వరుణుడు..
మల్లెల వంటి జల్లులను కురిపిస్తుంటే..
పంటలన్నీ పచ్చగా కనిపిస్తుంటే..
అణిగి పోయిన రైతు ఆశలు చిగురుస్తుంటే..
చూడటానికి వేయి కనులు చాలవు..
ఇప్పటికయినా అర్ధం కావాలి..
ఏలినినో సృష్టికర్తలం మనమేనని
మనం వదిలే పొగలే మనలను ముంచే మహమ్మారులని..
అందుకే మనందరం మారాలి..
పర్యావరణాన్ని రక్షించే సైనికుల లాగా..
అప్పుడే చూడగలం ఆహ్లాదకరమైన ఈ వాతావరణం ..
No comments:
Post a Comment